Srimad Valmiki Ramayanam

Balakanda

Chapter 6 ... Dasaratha !!

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహః |
దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపద ప్రియః ||

బాలకాండ
ఆఱవ సర్గము

అయోధ్యానగరములోనున్న దశరథ మహారాజు కోసలరాజ్యమును పరిపాలించెను.

ఆ దశరథ మహారాజు వేదార్థములను పూర్తిగా తెలిసుకున్నవాడు, దూరదృష్టి గలవాడు, చాలా తేజస్సు కలవాడు, పురజనులకు జనపదమునుండు అందరికీ ప్రియమొనర్చువాడు, ఇక్ష్వాకు వంశములో అతిరథుడు , విధి యుక్తముగా యజ్ఞయాగాదులను చేయువాడు, ధర్మమును అనుసరించువాడు, ఈ విధముగా అందరినీ వశములోనుంచుకొనువాడు, మహర్షితో సమానమైనవాడు, రాజ ఋషి, ముల్లోకములలో ప్రసిద్ధుడు, బలవంతుడు , శతృవులను అంతముచేయగలిగిన వాడు, జితేంద్రియుడు , మిత్రులు గలవాడు, ధనములు తదితర నిధులు కలిగియుండుటలో ఇంద్రునితో కుబేరునితో సమానుడు, లోక పరిరక్షణ యందు మహాతేజముకల వైవస్వత మనువు వలె పరిపాలించువాడు.

ఆ దశరథమహారాజు సత్యసంధుడు, ధర్మమును అనుసరించి ధర్మ అర్థ కామములను మూడింటిని రక్షించువాడు అయిన ఆ మహారాజు ఇంద్రుడు అమరావతిని పాలించినటుల పాలించుచుండెను. ఆ శ్రేష్ఠమైన నగరములో జనులు సంతోషముతో నుండిరి. ఆ జనులు ధర్మాత్ములు, అనేక శాస్త్రములను వినినవారు, తాము కష్ఠపడి సంపాదించిన ధనముతో తృప్తిచెందినవారు, సత్యము పలుకువారు.

అ ఉత్తమమైన అయోధ్యా నగరములో సంపన్నుడు కానివాడు, గోవులు అశ్వములు ధనధాన్యములులేనివాడు లేడు . వారు తమ సంపదలను ధర్మయుక్తముగా వినియోగించెడివారు. ఆ పురములో కామమునకు లొంగిన వాడు, లోభి , కౄరుడు , విద్యాహీనుడు, నాస్తికుడు గాని కానరారు.

ఆ నగరములో స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తనలో శ్రేష్ఠులు, నిగ్రహము కలవారు , సత్ స్వభావము కలవారు , సదాచారసంపన్నులు , మహాఋషులవలె నిర్మల హృదయముకలవారు. ఇంకా చెవికి కుండలములులేనివాడు , తలకు మకుటములేనివాడు, తనసంపదకు తగినటుల భోగములను అనుభవించనివాడు , అభ్యంగస్నానములను చేయనివాడు , సుగంధములను అనుభవించనివాడు , ఆ నగరములో లేడు .

ఆ అయోధ్యలో ఆకలిగలవారు , అతిథి అభ్యాగతులను అనాదరము చేయువారు , అర్థులకు దానము చేయనివారు ఆ నగరములో లేరు. హస్తాభరణములను కంఠాభరణములను ధరించనివారు లేరు. అంతః కరణ శుద్ధి లేనివారు కూడా లేరు. ఆచట అగ్నికార్యములను చేయనివాడు, యాగములను ఆచరించనివాడు , చాలీ చాలని సంపదలు కలవాడు , దొంగలు, వర్ణసంకరులు గాని లేరు.

ఆచటి బ్రాహ్మణులు విధియుక్తమైన తమ తమ పనులలో శ్రేష్ఠులు , జితేంద్రియులు, దానశీలురు , జపము వేదాధ్యయనము చేసెడి స్వభావము గలవారు. వారు దానములను స్వీకరించుటలో విముఖులు. ఆ నగరములో నాస్తికులు, అసత్యవాదులు, శాస్త్రములను విననివారు , అసూయాపరులు , అశక్తులు, విద్వాంసులు కాని వారు లేరు. ఆ నగరమున వేదాంగములు తెలియనివారు , వ్రతములను ఆచరించనివారు , వేలకొలదీ దానములను చేయనివాడు , దీనుడు, వ్యాకులమైన మనస్సు గలవాడు , రోగపీడుతుడు గాని లేరు.

స్త్రీ పురుషులలో శ్రీమంతులు గానివారు , రూపములేనివారు , రాజభక్తి లేని వారు ఆ నగరములో కనపడరు. ఆ నగరములో నాలుగువర్ణములవారు దేవతలను అతిథులను పూజించెడివారు, కృతజ్ఞత కలవారు, బ్రాహ్మణులు పాండిత్యముగలవారు , శూరులు పరాక్రమము గలవారు. ఆచటి నరులు అందరు సత్యమును ధర్మమును ఆచరించుటచే దీర్ఘమైన ఆయుస్సు గలవారు, భార్యపుత్రపౌత్రులతో కలిసి వుండెడివారు. అచటి క్షత్రియులు భ్రహ్మణులను గౌరవించెడివారు. వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించెడివారు. శూద్రులు తమ ధర్మమును నిర్వర్తించుచూ ఆ మూడూ వర్ణములవారిని సేవించెడివారు .

అట్టి నగరమును ఆ ఇక్ష్వాకు వంశజుడైన దశరథమహారాజు పూర్వకాలములో ప్రతిభావంతుడు మానవేంద్రుడు అయిన మనువు వలె పరిపాలించుచుండెను.

అచటి యోధులు పరాక్రమమున అగ్నివంటివారు . కుటిలత్వము లేనివారు. పరాభవము సహింపనివారు, అన్ని విద్యలలో ఆరి తేరిన వారు. అట్టి యోధులచే నిండిన ఆ నగరము సింహముయొక్క గుహవలె దుర్భేద్యముగా నుండెను.
కాంభోజ దేశపు గుఱ్ఱములతోనూ , బాహ్లీకదేశపు ఉత్తమమైన అశ్వములతోనూ , వనాయురాజ్యపు అశ్వములతోనూ , నదీదేశపు ఉత్తమమైన అశ్వములతోనూ ఆ పురము నిండియుండెను. వింధ్యపర్వత ప్రాంతమున పుట్టిన మదపుటేనుగలతోనూ , హిమాలయపు మహాగజములతోనూ , మిక్కిలి బలించి మదించి పర్వతములవలెనున్న మాతంగములతోనూ , ఇరావతవంశమునకు చెందినవీ , మహాపద్మజాతి చెందినవీ , అంజన జాతికి చెందినవీ , వామనజాతిలో జన్మించినవీ అగు భద్రగజములతో ఆ పురము నిండియుండెను.

భద్రజాతి గజములతోడనూ , మంద్రజాతి గజములతోడనూ , మృగజాతి గజములతోడనూ , అట్లే భద్ర మంద్ర, భద్రమృగ , మంద్రమృగ సంకర్షణముతో పుట్టిన గజములతోనూ , భద్ర మంద్ర మృగ మూడు జాతుల సంకర్షణముతో జన్మించిన గజములతోనూ ఆ నగరము నిండియుండెను.

ఆ అయోధ్యా నగరము బయట రెండు యోజనముల మేరకు వ్యాపించియుండెను. సార్థక నామము గల ఆ అయోధ్యా నగరమును దశరథమహారాజు పరిపాలించుచుండెను. రాజ శిరోమణి , మహాతేజోవంతుడు ఆయిన దశరథమహారాజు , చంద్రుడు తనకాంతితో నక్షత్రములను కాంతివిహీనము చేసినటుల తన శతృవులను తేజోవిహీనులను గావించుచూ పరిపాలించుచుండెను.

ఆ నగరము పేరుకు తగినటుల ధృడమైన గడియలుగల ద్వారములతోనూ చిత్రములైన గృహములతోనూ, శోభిల్లుచుండెను. వేలకొలదీ పురజనులతో నిండియున్న ఆ అయోధ్యానగరమును ఇంద్ర సమానుడైన ఆ దశరథ మహారాజు పరిపాలించుచుండెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే
వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే షష్ఠః సర్గః ||
|| సమాప్తం ||
|| ఈ విధముగా శ్రీమద్రామాయణములో బాలకాండలో ఆఱవ సర్గ సమాప్తము. ||

తాం సత్యనామాం దృఢతోరణార్గళాం
గృహైః విచిత్రైః ఉపశోభితాం శివామ్ |
పురీం అయోధ్యాం నృసహస్రసంకులాం
శశాస వై శక్రసమో మహీపతిః ||

ఆ నగరము పేరుకు తగినటుల ధృడమైన గడియలుగల ద్వారములతోనూ చిత్రములైన గృహములతోనూ, శోభిల్లుచుండెను. వేలకొలదీ పురజనులతో నిండియున్న ఆ అయోధ్యానగరమును ఇంద్ర సమానుడైన ఆ దశరథ మహారాజు పరిపాలించుచుండెను.

|| om tat sat ||